BJP: ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడమే కష్టమై పోతోంది సర్కారుకు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జీతాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకటో తేదీన జీతం వస్తుందనే అంచనాతో ఇప్పటికే EMI లు పెట్టుకున్న జాబ్ హెల్డర్స్ జీతాలు ఆలస్యం అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక, ధనిక రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దివాళా తీయించారని.. జీతాలు కూడా టైమ్ కి ఇవ్వలేని దుస్థితికి దిగజార్చారంటూ సమయం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు రాజకీయ దాడి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరింత పెంచాలంటూ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వేతన సవరణ సంఘం (PRC) ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జులై ఒకటి నుంచి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించకుండా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని బండి సంజయ్ లేఖలో మండిపడ్డారు.
సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్సీ నివేదికను 2018 జులై ఒకటి నుంచి అమలు చేయాల్సినప్పటికీ.. 21 నెలలుగా అమలు చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త ‘పే రివిజన్ కమిషన్’ (PRC)ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, ఉద్యోగుల తరఫున బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.