BJP: ఎమ్మెల్సీ కవితకు పోటీగా కౌంటర్ దీక్ష చేపట్టేందుకు రెడీ అవుతోంది తెలంగాణ బీజేపీ. ఢిల్లీలో కవిత దీక్ష చేపడుతుండగా.. హైదరాబాద్లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా.. మహిళ గోస-బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ బీజేపీ ప్రకటించింది.
రాష్ట్రంలో పెరిగిన బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణతో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. మహిళా నేతలంతా దీక్షలో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద కవిత చేపట్టిన దీక్షకు లైన్ క్లియర్ అయింది. ఈ దీక్షలో పాల్గొనేందుకు తెలంగాణ మహిళా మంత్రులు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ శుక్రవారం జరగనున్న దీక్షలో పాల్గొనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష జరగనుండగా.. మొత్తం 6 వేల మంది కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు.