BJP Campaign : తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇంకా 45 రోజుల్లో ఏ పార్టీ తెలంగాణ రాజ్యమేలుతుందో తేలిపోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా..నేడో రేపో బీజేపీ కూడా జాబితాను ప్రకటించనుంది. దీంతో అసలు సిసలైన పోరు ఇకపై మొదలవ్వబోతోంది. ఈ ముక్కోణ పోరులో.. గెలుపే లక్ష్యంగా రాజకీయ కార్యకలాపాలను బీజేపీ ముమ్మరం చేసింది.
ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కమలనాథులు తెలంగాణకు క్యూ కట్టారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్లలో ప్రధాని మోడీ పర్యటనతో.. కాషాయ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదిలాబాద్లో జనగర్జన సభ నిర్వహించారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోడీ, అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆదివారం హైదరాబాద్లో పర్యటించిన కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముషీరాబాద్, అంబర్పేట్లో మత్స్య కారుల సమావేశంలో పాల్గొన్నారు.
ఇక నేడు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించనున్నారు. మంత్రులు రాజ్నాథ్ సింగ్, పురుషోత్తం రూపాల వేర్వేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట బహిరంగసభకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఆ తరువాత మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సభలోనూ పాల్గొననున్నారు. ఓ వైపు రాజ్నాథ్ సింగ్ పర్యటన కొనసాగుతుండగానే.. మరో వైపు మరో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల కూడా పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభకు రూపాలా హాజరుకానున్నారు.