BJP-BRS Secret Alliance | బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజేపీ ప్రధాన పార్టీలు ఎన్నికలలో గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మూడు పార్టీలలో ప్రతి ఒక్క పార్టీ.. మిగతా రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని.. అవి రెండు కలిసి పోరాడుతున్నాయని ప్రచారం చేసుకుంటోంది. దీంతో ప్రజలు ఏ పార్టీ నిజం చెబుతోందో.. ఏ పార్టీ అబద్ధం చెప్తోందో తెలియని పరిస్థితి.
BJP-BRS Secret Alliance | రాజకీయాలంటే సామాన్యులకు అంత ఈజీగా అర్థమయ్యేవి కావు. ఒక పార్టీ నాయకులు మరొక పార్టీ నాయకులను విపరీతంగా తిడతారు. కానీ లోలోపల వారితో కలిసి ఉంటారు. ఒక పార్టీని తీవ్రంగా విమర్శించిన నాయకులే.. కొంతకాలం తరువాత అదే పార్టీలో చేరిపోతారు. అందుకే అంటారు.. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. స్నేహమైనా.. శత్రుత్వమైనా.. చివరికి అధికారమైనా.
తాజాగా తెలంగాణ ఎన్నికలలో దీనికి ఒక ఉదాహరణ కనిపిస్తోంది. బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజేపీ ప్రధాన పార్టీలు ఎన్నికలలో గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మూడు పార్టీలలో ప్రతి ఒక్క పార్టీ.. మిగతా రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని.. అవి రెండు కలిసి పోరాడుతున్నాయని ప్రచారం చేసుకుంటోంది. దీంతో ప్రజలు ఏ పార్టీ నిజం చెబుతోందో.. ఏ పార్టీ అబద్ధం చెప్తోందో తెలియని పరిస్థితి.
ఈ విషయంలో స్పష్టత కోసం కర్ణాటక ఎన్నికలను గమనించాలి. అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్లో ఉత్సాహం పెంచింది. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ అవకాశం ఇస్తారని నమ్మకం కలిగింది. దీంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది.
ఇక్కడే బిఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకు డేంజర్ బెల్స్ మోగాయి. కర్ణాటక ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో బిఆర్ఎస్కు బీజేపీని ప్రధాన ప్రత్యర్థి అని అందరూ భావించారు. కానీ కర్ణాటక జోష్తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు బీఆర్ఎస్ని తీవ్రంగా విమర్శించిన బీజేపీ నాయకులు.. సౌండ్ చేయడం మానేశారు. అంతేకాదు బిఆర్ఎస్పై ఒంటికాలు మీద లేచే బండి సంజయ్ని తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారు.
ఢిల్లీ మద్యం స్కామ్లో నిందితురాలైన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న కేంద్ర సంస్థల విచారణ కూడా నెమ్మదించింది. ఇవన్నీ చూస్తుంటే.. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. తెలంగాణ ముక్కోణపు రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ ఒకవైపు.. బిఆర్ఎస్, బీజేపీ ఒకవైపు అని.
ఎందుకంటే కేంద్రస్థాయిలో బీజేపీకి, తెలంగాణలో బిఆర్ఎస్కి ఇప్పుడు ప్రధాన శత్రువు కాంగ్రెస్. ఇప్పటికే కర్ణాటకలో చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్ని బీజేపీ ఇప్పుడు రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలలో కూడా ఎదుర్కొంటోంది. ఈ అయిదు రాష్ట్రల ఎన్నికలలో కాంగ్రెస్ కనీసం రెండు గెలిచినా లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే బిజేపీ తన గెలుపు కన్నా కాంగ్రెస్ ఓటమికే ప్రాధాన్యం ఇస్తోంది. కాంగ్రెస్ ఓటమి కోసం బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం కేసీఆర్తో లోలోపల చేతులు కలిపిందని రాజకీయ పరిస్థితులు గమనిస్తే అర్థమవుతోంది.
ఇప్పటికే దేశమంతా బిజేపీ పాలనపై ప్రజలకు అసహనం పెరిగిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కీలకమైన లోక్సభ ఎన్నికల ముందు ఇలాంటి సమస్య రావడం మోదీ ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకోసం తెలంగాణలో బీజీపీకి ఎలాగూ గెలిచే పరిస్థితి లేదు.. కనుక కాంగ్రెస్ ఓటమి కోసం అది పనిచేస్తోంది. అందుకే బిఆర్ఎస్కు బీజేపీ పూర్తి సహకారం అందిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సూచనల మేరకు కాంగ్రెస్ నాయకుల ఇళ్ళు, కార్యాలయాలపై మోదీ ప్రభుత్వం.. ఐటి దాడులు చేయించిందని కాంగ్రెస్ నాయకుల ఆరోపిస్తున్నారు. అలా చేస్తే.. ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచగలవు కానీ కాంగ్రెస్ నాయకులు ఆ పని చేయలేరు. అప్పుడు వారిని సులువుగా ఓడించవచ్చని కేసీఆర్ ప్లాన్.
అలాగే కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమీషన్ తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. రైతుబంధు నిధులు విడుదల ఆపేసింది. కానీ ప్రస్తుతం రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతించింది. మరో నాలుగు రోజులకు ఎన్నికలు జరుగనుండగా.. ఈసీ ఇలా చేయడంతో కాంగ్రెస్ నాయకులు షాక్కు గురయ్యారు. ఇంతకాలం రైతు బంధు నిధుల విడుదలను ఆపిన ఎన్నికల సంఘం మరో 5 రోజులపాటు అడ్డుకోలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సంఘం ఇలా చేయడానికి బీజేపీని కారణమని.. కేసీఆర్ సూచన మేరకే బిజేపీ ఇలా చేసిందని కాంగ్రెస్ వాదిస్తోంది. దీంతో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. బిజేపీ, బిఆర్ఎస్ తెరవెనుక నుంచి కలిసి పోటీచేస్తున్నాయి. అయితే ఒక విషయం గమనించాలి. బిజేపీ ఈ త్యాగం లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తోంది. మరి బిఆర్ఎస్ కూడా ఇలాగే లోక్ సభ ఎన్నికల సమయంలో బిజేపీకి సహకరిస్తుందా? అనేది తెలియాలంటే.. మరికొన్ని నెలలు వేచిచూడాల్సిందే.