BJP-BRS : తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయని చెప్పడానికి బలమైన ఆధారాలు ఒకొక్కటిగా దొరుకుతున్నాయి. బీజేపీ ఎంపీ అరవింద్ ప్రచార సభలో కేసీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
ఒకరోజు గడిచిందో లేదో.. రైతు బంధు పథకం కింద నగదు బదిలీ చేయవచ్చునని ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఈసీ అనుమతి మంజూరు చేసింది. దీంతో అధికార పార్టీ యుద్ధ ప్రాతిపదికన అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి. మిగిలిన పథకాలకు కూడా అనుమతులు ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా కుట్రపూరిత చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ, బీఆర్ఎస్ లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని, వీళ్లిద్దరూ కలిసిపోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ జరిగితే.. రేపు భవిష్యత్తులో జరిగే ఎన్నికలు మరింత విషపూరితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అంటున్నారు. ఎన్నికలను ఇలా కలుషితం చేయవద్దని కోరుతున్నారు.
మరో రోజు గడిచిందో లేదో.. మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో రూ.1000 కోట్లు ఉన్నాయని, అదంతా ఎన్నికల్లో డబ్బు పంపిణీ కోసం నియోజకవర్గాలకు చేరుతోందన్న వ్యవహారం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ సమాచారాన్ని ఈసీకి అందించింది. కాంగ్రెస్ నేతలు మధ్యాహ్నం చెబితే రాత్రి తీరిగ్గా గోయల్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ఫోర్స్ పోలీసులు ఒకేసారి సోదాలు చేశారు. ఇంకేం ఉంది.. ఏమీ లేదని చెప్పి వచ్చేశారు.
ఇంతకీ ఎవరీ ఏకే గోయల్ అంటే.. 2010లో ఐఏఎస్ అధికారిగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుడిగా పనిచేశారు. అంత పబ్లిగ్గా ఆయన ఆ పార్టీ మనిషి అని తెలిసిన తర్వాత కూడా ఇదంతా కుట్ర కాకపోతే మరేమిటి? అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
అధికారపార్టీ చెప్పినట్టు చేయడనికేనా బ్యూరోక్రసీ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపున ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నైతికంగా ప్రభుత్వ పాత్ర అయిపోయినట్టే అని చెప్పాలి. కేవలం అక్కడ అంతవరకు ఉన్న ముఖ్యమంత్రి ఉత్సవ విగ్రహంగా మారిపోతాడు.
కానీ ఇంకా కేసీఆర్ రైతు బంధు పథకాన్ని రైతులకి ఇస్తున్నారు. అధికారులను ఆదేశిస్తున్నారు. దానికి ఈసీ కూడా సై అంటోంది.. ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా అర్థం కాకపోవడానికేముంది.. వాళ్ళిద్దరూ కలిసి పోయారు. బీజీపీ-బీఆర్ఎస్ కలిసే ఇంతా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయంగా కనిపించడం వల్లే ఇన్ని అడ్డదారులు తొక్కుతున్నారని అంటున్నారు.
ఏం జరిగినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని, వాళ్లు ఎన్నివిధాలుగా కుయుక్తులు పన్నినా ఛేదిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, దానినెవరూ ఆపలేరని అన్నారు. అంతిమ విజయం తమదేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియమ్మే రాష్ట్రాన్ని అభివ్రద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. దురహంకారపాలనకు చరమగీతం పాడేరోజు వచ్చేసిందని తెలిపారు. ప్రజల మైండ్ లోకి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వెళ్లిన తర్వాత… మార్చడం ఎవరి తరం కాదని అన్నారు.