Jayasudha joined in BJP(Latest political news telangana): సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. జయసుధకు పొలిటికల్ ఎంట్రీ కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దించుతారని అంటున్నారు.
జయసుధ బీజేపీలో చేరడంకంటే కూడా.. ఓ క్రిస్టియన్ అయిన ఆమె.. కాషాయ కండువా కప్పుకోవడమే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది బీజేపీపై ఉన్న హిందుత్వ ముద్రను కవర్ చేసుకునే ప్రయత్నమా? అన్నివర్గాలను అక్కున చేర్చుకునే ప్రణాళికా? జయసుధను రారమ్మని పిలిచి మరీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారా? బీజేపీ బిగ్ స్కెచ్చే వేసిందా? అంటే అవుననే అంటున్నారు.
ఇప్పటికే లేడీ అమితాబ్, తెలంగాణ రాములమ్మ విజయశాంతి కాషాయ శిబిరంలో ఉన్నారు. ఫేస్ వ్యాల్యూతో పాటు పొలిటికల్ క్రేజ్ కూడా ఉన్న లీడర్ ఆమె. మంచి స్పోక్ పర్సన్ కూడా. జయసుధలో ఇలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేయలేము. కేవలం సినీ గ్లామర్ కోసమే ఆమెను పార్టీలో చేర్చుకున్నారని కూడా అనుకోడానికి లేదు. జయసుధ రాకలో పార్టీకి వచ్చే అదనపు మైలేజ్ పెద్దగా ఉండకపోవచ్చు. మరి జయసుధ ఎంట్రీ వెనుక వ్యూహమేంటి?
పెద్ద టార్గెట్ ఏమీ లేదంటున్నారు. సింపుల్గా సికింద్రాబాద్ సీటు కోసమే అని చెబుతున్నారు. అవును, నిజమే. ఒక్క సీటు కోసమే జయసుధకు ఢిల్లీ నుంచి గ్రాండ్ వెల్కమ్ వచ్చింది. నేరుగా అమిత్షా నుంచే అనుమతి లభించింది. సికింద్రాబాద్ నగర పరిధిలో క్రిష్టియన్ జనాభా ఎక్కువ. పార్శీలు, మార్వాడీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్యా ఎక్కువే. కాస్త మంచి అభ్యర్థిని బరిలో నిలిపితే.. బీజేపీ ఈజీగా గెలిచే సీటు. కానీ.. గత ఎన్నికల్లో కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్ లాంటి వాళ్లే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈసారి అలా జరగొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే మాజీ ఎమ్మెల్యే జయసుధను గేమ్ ఛేంజర్గా తీసుకొచ్చారని అంటున్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆమె నేరుగా ప్రభావం చూపించగలరు.
ఇలా, ఒక్క సీటే కదాని లైట్ తీసుకునే పరిస్థితి లేదు బీజేపీకి. ఈసారి తెలంగాణలో ప్రతీ ఒక్క సీటూ మోస్ట్ ఇంపార్టెంటే. ఇలా ఒక్కొక్క గెలుపును లెక్కలేసుకుంటూ.. 75 గెలుపులను మూటకట్టుకోవాలనే బిగ్ స్కెక్ వేసింది బీజేపీ. ఆ మేరకు అమిత్ షా నుంచి స్టేట్ బీజేపీకి సీరియస్ ఆర్డర్స్ వచ్చాయని తెలుస్తోంది.
తెలంగాణలో 75 స్థానాలను ఎలాగైనా గెలవాల్సిందే. షా చెప్పేశారు. ఇకపై మీకిష్టం వచ్చినట్టు చేస్తే కుదరదని.. తనకిష్టం వచ్చినట్టే అంతా చేయాలని ఆదేశించారు. తెలంగాణ బీజేపీలోని అగ్రనేతలంతా అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధం కావాలని హుకూం జారీ చేశారని సమాచారం. కిషన్రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, కె.లక్షణ్.. ఇలా ప్రముఖ నేతలంతా ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని తేల్చిచెప్పారట. అలా తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్న 25-30 మంది నాయకులను గుర్తించి.. వాళ్ల కోసం పక్కాగా గెలిచే అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించాలని ప్రణాళికలు రచించారని తెలుస్తోంది.
టాప్ లీడర్లతో పాటు.. జిల్లాల్లో బలమైన నాయకులను, ఎన్నికల నాటికి పార్టీలో చేరే సమర్థులైన వలస నేతలను.. పార్టీ తరఫున పోటీ చేయించి.. గంపగుత్తగా 75 సీట్లు కొల్లగొట్టాలని ఖతర్నాక్ స్కెచ్ వేశారట కమలనాథులు. ఇక నుంచి పార్టీ వ్యవహారాలన్నీ ఢిల్లీ నుంచే నడుస్తాయని.. రాష్ట్ర నేతలు కేవలం ఢిల్లీ ఆదేశాలను ఫాలో కావడమే వారి డ్యూటీ అని చెబుతున్నారు. నేతలెవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని.. ఎరక్కపోయి మాట్లాడి ఇరుక్కుపోవద్దని.. గ్రూపులు గట్రా కట్టొద్దని.. ప్రత్యర్థి పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని.. అమిత్షా గట్టిగానే చెప్పారని సమాచారం. జయసుధ ఎంట్రీ ఒక్క సీటు కోసమేనని.. దీన్నిబట్టి ప్రతీఒక్క స్థానానికి కాషాయదళం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తోందని అంటున్నారు.