Telangana BJP news(Today breaking news in Telangana): బీజేపీ మళ్లీ యాక్టివ్ అయింది. కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్లో ఉండిపోయినా.. లేటెస్ట్గా జోరు వానలోనూ తఢాఖా చూపించింది. చలో బాటసింగారం అంటూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలనకు పిలుపు ఇచ్చింది కమలదళం. అంతే ఒక్కసారిగా కలకలం.
పోలీసులు రాత్రి నుంచే అలర్ట్ అయ్యారు. కొందరు బీజేపీ ప్రముఖులను హౌజ్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కేడర్ను అడ్డుకున్నారు. పోలీస్ ఆంక్షలను లెక్క చేయకుండా.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు రోడ్డెక్కారు. బాటసింగారం బాట పట్టారు.
శంషాబాద్ ఏరియాకు వచ్చేసరికి వారిని అడ్డుకున్నారు పోలీసులు. ముందుకు వెళ్లనిచ్చేది లేదని చెక్ పెట్టారు. కిషన్ రెడ్డి వినలేదు. రఘునందన్ రావుతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. జోరు వానలోనూ అలానే నడిరోడ్డుపై కూర్చున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఓ కేంద్రమంత్రిని తననే అడ్డుకుంటారా? తానేమైనా ఉగ్రవాదినా? అని ఫైర్ అయ్యారు కిషన్రెడ్డి. శాంతియుతంగా పరిశీలనకు వెళుతుంటే అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదంటూ ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. కల్వకుంట్ల పాలనలో పేదల ఆశలు అడియాసలయ్యాయని.. బీఆర్ఎస్ను గద్దె దించేవరకు పోరాడుతామని కిషన్రెడ్డి ఫైర్ అయ్యారు.
అయినా, పోలీసులు వెనక్కి తగ్గలేదు. రోడ్డుపై ధర్నాకు దిగిన బీజేపీ అగ్రనేతలను బలవంతంగా వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఈ ఆందోళన వల్ల శంషాబాద్ ఏరియాలో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. వానలోనూ బీజేపీ నేతల ఆందోళనకు ఫుల్ మైలేజ్ వచ్చింది. ఎంపీ బండి సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం మాత్రం ఆసక్తికరం.