ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి. గతంలో ప్రగతిభవన్, రాజ్భవన్ మధ్య గ్యాప్ రావటం.. గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించటం వంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడూ అదే తరహా రిపీట్ అవుతుందా.. అనే చర్చలు కొనసాగుతున్నాయి.
గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల్లో రెండింటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి మండలి ఆమోదించింది. వీటిలో పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్దేశించిన గడువును మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పెంచాలన్న బిల్లుతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఉన్నాయి. ఇప్పటికే ఆమోదించిన ఈ రెండు బిల్లులను చాలా కాలం క్రితమే గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయినా వాటికి మోక్షం లభించకపోవడంతో మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తిరస్కరించడంపై మంత్రిమండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని, చట్టసభలను అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల నిర్ణయాలను అవమానించేలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంది. గవర్నర్ తిప్పి పంపిన పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ బిల్లులను మళ్లీ శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించి పంపేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రెండోసారి పంపిన బిల్లులను విధిగా గవర్నర్ ఆమోదించాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.