pallavi prashanth : బిగ్బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రవేట్ వాహనాలు ధ్వంసం చేసిన కేసులో ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతని సోదరున్ని సైతం అదుపులోకి తీసుకున్నారు.
పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు తొమ్మిది(9)సెక్షన్లలో కేసు నమోదు చేశారు. బిగ్బాస్ సీజన్లో విన్నర్గా నిలిచిన ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ అభిమానులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశాంత్ స్టూడియో నుంచి బయటికి రాగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ సైతం బయటికి రావడంతో ఇద్దరి అభిమానులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనలో ప్రభుత్వ ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. రక్షణ కల్పించడానికి వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడికి ప్రధాన కారణం పల్లవి ప్రశాంత్ అని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఎ-1 పల్లవి ప్రశాంత్ పేరు చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ ను , ఎ-3గా ప్రశాంత్ స్నేహితుడు వినయ్ పేరుని చేర్చారు. లాంగ్ డ్రైవ్ కార్స్ లో డ్రైవర్లుగా పనిచేస్తున్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు(23)ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.