Big Shock to BRS : బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. గులాబీ పార్టీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అభ్యర్థుల జాబితాలో మార్పులు చేయడమే గులాబీ బాస్ చేసిన తప్పిదంగా తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడంతోనే వారితో పాటు వారి అనుచరులు సైతం పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీగూటికి చేరుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బోధన్ చైర్ పర్సన్ గా ఉన్న పద్మ, ఆమె భర్త శరత్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరనున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ బాటలోనే సర్పంచ్ లు, కౌన్సిలర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ లో చేరనున్న క్రమంలో వారందరికీ పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ర్యాలీ వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు వారు చెబుతున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు వారంతా హైదరాబాద్ కు బయల్దేరినట్లు తెలుస్తోంది.
మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. పార్టీకి నీలం మధు ముదిరాజ్ రాజీనామా చేశారు. చివరిక్షణం వరకు పటాన్చెరు నిజయోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే.. ఆదివారం సిట్టింగ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికు కేసీఆర్ బీఫాం ఇవ్వడంతో ఆయన కంగుతున్నారు. దీంతో.. పార్టీకి రాజీనామా చేశారు. కొత్తపల్లి గ్రామం నుండి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో తప్పకుండా ఉంటానని తన అనుచరులకు తెలిపారు.