BRS Municipal Chairmans: బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. గులాబీ గెలిచిన పలుచోట్ల మున్సిపల్ ఛైర్మన్లపై.. అవిశ్వానికి రంగం సిద్ధమైంది. కారు పార్టీ తిరుగుబాటు కౌన్సిలర్లు సహా కాంగ్రెస్, MIM, బీజేపీ నేతలు సైతం ఛైర్మన్లను గద్దే దింపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఛైర్మన్లకు పదవీగండం తప్పేలా లేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాస సెగలు రాజుకున్నాయి. మహబుబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ఆ పార్టీ నేతలు సైతం.. రహస్య మంతనాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు BRS కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 49మంది కౌన్సిలర్లతో మహబూబ్నగర్ మున్సిపల్ పాలక వర్గం కొలువు దీరింది. BRS మున్సిపల్ ఛైర్మన్ నర్సింహ్ములుపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీతో పాటు మొత్తం 32 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు తీర్మానాన్ని అందజేశారు.
జడ్చర్లలో అవిశ్వాస తీర్మానాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు వేస్తున్నారు. అవిశ్వాసం కాకుండా రాజీనామా చేయించి కొత్తవారిని ఎన్నుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంట్లో BRS నేతలు రహస్య మంతనాలు నిర్వహిస్తున్నారు. జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త దోరపల్లి రవీందర్పై కౌన్సలర్లు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి గెలుపు తర్వాత మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ కన్ను పడింది. కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యంను మార్చేందుకు కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. మొత్తం 22 మంది కౌన్సిలర్లలో 6గురు BRS కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నాగర్ కర్నూల్లో మొత్తం 24మంది కౌన్సిలర్లు ఉండగా.. అందులో 7గరు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస వేడి మొదలైంది. ఇప్పటికే కలెక్టర్కు అవిశ్వాస తీర్మాన కాపీని.. అసమ్మతి కౌన్సిలర్లు అందజేశారు. నేడు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానాం నిర్వహించనున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో.. ఎక్స్ ఆఫీషియో ఓట్లతో సైదిరెడ్డి ఛైర్మన్గా ఎన్నికయ్యారు.