BJP : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో మరో కలవరం మొదలైంది. వరంగల్లో మోదీ సభ రోజే కొంతమంది నేతలు పార్టీకి గుడ్బై చెబుతారంటూ ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి, నిజామాబాద్,పెద్దపల్లి, మహబూబ్నగర్కు చెందిన కీలక నేతలు కాషాయ పార్టీని వీడతారని తెలుస్తోంది. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. అలాగే ఈటలతోపాటు బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ నెల 8న వరంగల్ కు ప్రధాని మోదీ రానున్నారు. అక్కడ నిర్వహించే విజయ సంకల్ప సభను గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల పార్టీలో నేతల మధ్య సమన్వయం కొరవడింది. వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరుకు దిగారు. ఈ పంచాయితీ హస్తినకు చేరింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించారు. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పంగించారు.
వరంగల్ లో మోదీ సభను విజయవంతం చేయడం కిషన్ రెడ్డి ముందు పెద్ద టాస్క్. గతంలో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా హాజరైన సభలను బండి సంజయ్ సక్సెస్ చేశారు. సికింద్రాబాద్ సభలో స్వయంగా మోదీనే బండి సంజయ్ ను అభినందించారు. మరి కిషన్ రెడ్డి కూడా అదే స్థాయిలో వరంగల్ సభను విజయవంతం చేయగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీ దూకుడుగా ఉంది. కన్నడ తీర్పు రాష్ట్ర బీజేపీపై తీవ్ర ప్రభావం చూపింది. కాషాయ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలు వెనక్కితగ్గారు. ఆ నేతలందరూ కాంగ్రెస్ కుండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పుడు మరికొందరు నేతలు అదేబాటలో ఉన్నారని తెలుస్తోంది. చేరికల సంగతి అటుంచితే వలసలకు బ్రేకులు వేయడం కిషన్ రెడ్డి ముందున్న పెద్ద సవాల్. రాష్ట్రంలో ఎన్నికలకు 5 నెలల మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి ఎదురవుతున్న సవాళ్లను కిషన్ రెడ్డి ఎలా అధిగమిస్తారనే చర్చ నడుస్తోంది.