Big Relief for DSC Candidates : తెలంగాణలో డీఎస్సీ రాసే అభ్యర్థులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఒకేరోజు 2 సబ్జెక్టులకు పరీక్ష రాయవలసిన అభ్యర్థుల కోసం స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలిపింది. అలాంటివారు ఒకే పరీక్ష సెంటర్లో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఉదయం పరీక్ష రాసే సెంటర్లోనే మధ్యాహ్నం పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాంటి అభ్యర్థుల హాల్ టికెట్లను మార్చుతామని అధికారులు స్పష్టం చేశారు.
డీఎస్సీ అభ్యర్థుల్లో చాలా మంది నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేసుకోవడంతో ఉదయం పరీక్ష ఒక జిల్లాలో.. మధ్యాహ్నం పరీక్ష మరో జిల్లాలో సెంటర్ పడింది. దీంతో ఒక పరీక్ష కేంద్రానికి మరో పరీక్ష కేంద్రానికి చాలా దూరం ఉండటంతో.. రెండు పరీక్షలు ఎలా రాయాలని అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని.. వారికి ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా.. జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసింది.
Also Read : డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్టికెట్లు విడుదల
డీఎస్సీ అభ్యర్థులకు గురువారం రాత్రి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు నిర్వహించనుంది విద్యాశాఖ. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 బాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, 220 స్పెషల్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు, 796 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ కానున్నాయి. మార్చి 4వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకూ అందిన దరఖాస్తులను బట్టి.. మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు.