Data Leak: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నామని ధీమాగా ఉన్నారా? మీరు సోషల్ మీడియా అకౌంట్లలో యాక్టివ్గా ఉంటారా? మీకు మాత్రమే తెలిసేలా పాస్వర్డ్ పెట్టుకున్నారా? హమ్మయ్య.. అని రిలాక్స్గా ఉన్నారా.. అయితే మీరు ఉలిక్కిపడే న్యూస్ ఇది. దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ అది.
ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 16 కోట్ల 80 లక్షల మంది డేటాను లీక్ చేశారు కేటుగాళ్లు. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్.. ఫేస్ బుక్, ఇన్స్ట్రా యూజర్ ఐడీ, పాస్వర్డ్స్.. క్రెడిట్, డెబిట్ కార్డు డిటైల్స్.. మొత్తం చోరీ అయ్యాయి.
నిందితులు పక్కాగా డేటా చోరీకి పాల్పడ్డారు. ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, లోన్ అప్లికేషన్ల కోసం ఇచ్చిన వివరాలను సేకరించారు. ఆ డేటాను సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తుననారు కేటుగాళ్లు.
నిందితుల దగ్గర రెండున్నర లక్షల మంది ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా ఉందంటే నమ్మాల్సిందే. ఢిల్లీకి చెందిన 35వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం మొత్తం కొల్లగొట్టారు. అందుకే, ఈ డేటా లీక్తో దేశ భద్రతకే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల డేటా కూడా సైబర్ నేరగాళ్లకు విక్రయించారు నిందితులు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఏజెన్సీ ఉద్యోగి తన దగ్గర ఉన్న డేటాను నిందితులకు అమ్ముకున్నాడు.
దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రజల పర్సనల్ డేటాను చోరీ చేసి అమ్ముకుంటున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఆ వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామని.. వారి నుంచి 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా రికవరీ చేశామని చెప్పారు.