Bhatti Vikramarka about Sardar Papanna Goud: సర్దార్ పాపన్న జీవితం ఆదర్శప్రాయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. పాపన్న ఆశయాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం చెప్పారు. హైదరాబాద్ నగరంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆయనతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
రాజ్యాంగం, చట్టాలు లేని సమయాల్లో సర్దార్ పాపన్న ప్రజల హక్కుల కోసం పోరాడారని భట్టి విక్రమార్క అన్నారు. భవిష్యత్తు తరాలకు సర్దార్ పాపన్న స్ఫూర్తి గాథలు తెలియజేయాలన్నారు. పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని, ఈ పర్యాటక కేంద్రానికి రూ.4.70కోట్లు కేటాయిస్తూ జీఓ విడుదల చేశామని వివరించారు.
పాపన్న గౌడ్ పర్యాటక కేంద్ర నిర్మాణ బాధ్యతలు మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకుంటారన్నారు. ముఖ్యంగా పాపన్న గురించి సులువుగా అర్థమయ్యేలా ప్రజలకు పాకెట్ పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యానికి సైతం సర్దార్ పాపన్న ఆలోచనలే మార్గదర్శకమని వెల్లించారు.
కాగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేరకు బీసీ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని గౌడ సంఘాల సూచనలతో రవీంద్రభారతిలో నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారు.
Also Read: హైదరాబాద్ లో 25 పబ్బుల్లో తనిఖీలు.. పలువురికి పాజిటివ్
ఇదిలా ఉండగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక సందేశం విడుదల చేశారు. అనంతరం ఆ మహావీరుడికి నివాళుర్పించారు. శతాబ్ధాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేదప్రజలను సంఘటితం చేశారన్నారు. రాజకీయ, సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న చరితం అసామాన్యమైందన్నారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం వారి ఆశయాలను కొనసాగిస్తోందని సందేశంలో పేర్కొన్నారు.