Bhatti Vikramarka latest news(Political news in telangana): బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టు డిజైన్లు సరిగ్గా లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. సుంకిశాల కాంగ్రెస్ కట్టించింది కాదని అన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు బీఆర్ఎస్ సృష్టించి వారు చేసిన తప్పిదాలను తమపై నెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే ప్రజలు క్షమించరని తెలిపారు. సుంకిశాలపై విచారణ చేసి వివరాలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
టీజీఎస్పీ డీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం భట్టి మాట్లాడారు. ప్రస్తుతం కూలిన సుంకిశాల గోడ బీఆర్ఎస్ హయాంలో కట్టించిందేనని అన్నారు. సుంకిశాల నిర్మాణంతో ప్రజల సొమ్మును వృథా చేశారని ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మాత్రమే కాదు.. బీఆర్ఎస్ కృష్ణా నదిని కూడా వదిలి పెట్టలేదని మండిపడ్డారు. అంతకు ముందు జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ ఎస్పీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్స్, ఎస్సీ, ఏడీలతో సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లో అనేక సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వస్తుంటాయని వాటికి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. నగర ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా చూడాలని తెలిపారు. వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా స్తంభాలు పడిపోయి చెట్లు విరిపోయే అవకాశం ఉంటుందని అందుకే అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. సుంకిశాల ప్రాజెక్ట్ బీఆర్ఎస్ యాంలోనే చేపట్టారు. సాగర్ నీళ్లు వచ్చినందువల్లనే గోడ కూలిందని ఇప్పుడు ఆరోపిస్తున్నారు.
Also Read: అందరం తెలంగాణ బిడ్డలమే.. పీజీ స్టూడెంట్స్ పెద్ద మనసుతో ఉండాలి: ఎమ్మెల్సీ బల్మూరి
నీళ్ల కోసమే కదా సాగర్ కట్టింది.. గత ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్లు ఎంత పనికి రాకుండా ఉన్నాయో దీని ద్వారానే అర్థమవుతోంది. మీ కట్టడాలు, పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా తెలిసిపోతోంది. సుంకిశాల పాపం బీఆర్ఎస్కే చెందుతుందని అని భట్టి పేర్కొన్నారు. అధికారుల పదోన్నతులపై చర్యలు చేపట్టాలని సీఎండీలను ఆదేశించారు. విద్యుత్ శాఖలో గత ఎనిమిదేళ్లుగా ఉన్న పదోన్నతులు లేవని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిరంతరం విద్యుత్ సిబ్బంది పనిచేస్తున్నారని.. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 ఫోన్ చేయాలని అన్నారు.