Bharati Builders Real Estate Scam (): సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చూసిన మధ్యతరగతి ప్రజలను కొన్నిరియల్ ఎస్టేట్ సంస్థలు నమ్మించి నట్టేట ముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లతో ఆశల సౌధాలు నిర్మిస్తూ..వారిని బుట్టలో వేసుకుని కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయి. హైదరాబాద్ మహానగరంలో తాజాగా వెలుగుచూసిన భారతీ బిల్డర్స్ భాగోతం ఈ కోవలోనిదే. వేగంగా అభివృద్ధి చెందుతున్న కొంపల్లిలో అతి తక్కువ ధరకే అపార్టమెంట్లు నిర్మించి ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి 60 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఏకంగా 350 మంది మధ్యతరగతి ప్రజల కొంపముంచింది.
భారతీ బిల్డర్స్ రియల్ దందా భాగోతాన్ని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు బట్టబయలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు మాధాపూర్లోని ఆ సంస్థ ఛైర్మన్ దూపటి నాగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ మల్పూరి శివరామకృష్ణ,సీఈఓ టి. నర్సింహరావుని నిన్న అరెస్టు చేశారు. 2021లో వీరు మేడ్చల్లోని కొంపల్లిలో 6.23 ఎకరాల విస్తీర్ణంలో అపార్టుమెంట్లు నిర్మించి విక్రయించేందుకు ప్లాన్ చేశారు. చదరపు అడుగు 3,200 రూపాయల చొప్పున 350 మంది నుంచి 60 కోట్లు వసూలు చేశారు.
Also Read : భూ వివాదం.. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్
మాధాపూర్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసి కొనుగోలుదారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ బిల్డప్ ఇచ్చారు. ఆకర్షణీయమైన బ్రోచర్లు ముద్రించి ఏజెంట్లతో హడావుడి చేశారు. గారడీ మాటలతో బురిడీ కొట్టించి వారి ప్లాన్ విజయవంతంగా అమలు చేశారు. 60కోట్లు వసూలు చేయడమే కాకుండా సదరు ఆరెకరాల భూమిని కూడా వేరే పార్టీకి 100కోట్లకు అమ్మేసి బోర్డు తిప్పేశారు.
భారతీ బిల్డర్స్ లేక్ వ్యూ ప్రీ లాంచ్ పేరిట డిపాజిట్లు వసూలు చేసి మూడేళ్లు గడుస్తున్నాప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో బాధితులు ఆ సంస్థపై ఒత్తిడి తెచ్చారు. ఏవో సాకులు చెప్తూ కాలయాపన చేయడమేగానీ, నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో బీవీఎస్ ప్రసాదరావు అనే బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ రియల్ భాగోతం వెలుగుచూసింది.