ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. రామాలయం పరిసర ప్రాంతాల్లోని మాఢవీధుల్లోకి నీరు చేరింది. ఉత్తర ద్వారం వైపు ఉన్న దుకాణాల్లోకి వరద ముంచెత్తింది.
భద్రాచలం వద్ద గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. 44.5 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పొంగి రామాలయం చుట్టూ నీరు చేరింది. విస్తా కాంప్లెక్స్ అన్నదానసత్రం నీట మునిగింది. భద్రాచలం నుంచి 9.92 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భద్రాద్రి ఆలయం చుట్టూ వరద వెల్లువెత్తడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. వరదలు వస్తాయని తెలిసినా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని దుయ్యాబట్టారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఆలయ పరిసరాల్లోకి వరద చుట్టుముట్టడంతో బాహుబలి మోటర్లు పెట్టి నీటిని గోదావరిలోకి పంపిస్తున్నారు. అయితే మరికొన్ని మోటర్లు ఏర్పాటు చేస్తే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని చిరు వ్యాపారులు అంటున్నారు. గోదావరి ఉద్ధృతికి అటు పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.