Hyderabad : ఏటా సంక్రాంతికి భాగ్యనగరం బోసు పోతుంది. లక్షల మంది తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు తరలివెళ్తారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే జనం సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బోగి నాటికి లక్షలాది మంది తరలివెళ్లే అవకాశముంది. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు నగరానికి చేరుకొని దోపిడీలకు తెగబడుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్నగర్ ఠాణా పరిధి దమ్మాయిగూడ ఆర్సీ ఎన్క్లేవ్లోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. జవహర్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఠాణాల పరిధిలో ఇటీవల 10కిపైగా దోపిడీలు జరిగాయి.
పోలీసుల అప్రమత్తం..
హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. పాత నేరస్థులు, ఇటీవల జైలు నుంచి విడుదలైన నిందితులపై నిఘా పెట్టారు. అనుమానితులను గుర్తించేందుకు నగరవ్యాప్తంగా నాకా బందీ నిర్వహించారు. రాత్రివేళ విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సిబ్బందికి ఆదేశించారు. హాట్స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పోలీసుస్టేషన్ల అధికారులు, క్రైమ్ విభాగంతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
గస్తీ పెంపు..
వీధుల్లో గస్తీ ఏర్పాట్లు చేస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం ఇచ్చేలా స్థానికులను చైతన్యపరచాలని సిబ్బందిని ఆదేశించామని చెప్పారు.
జాగ్రత్తలివే..
బంగారు, వెండి ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. దగ్గర్లోని ఠాణా సమాచారం ఇవ్వాలి. కాలనీల్లో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకొని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా, డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ఇంటికి సెక్యూరిటీ అలారం, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి గేట్ తాళం కనిపించకుండా పరదాలు అడ్డుగా ఉంచాలి. ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.