Paigah Palace : సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం పైగా ప్యాలెస్ను అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం బేగంపేటలోని పైగా ప్యాలెస్ ను సీఎస్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పైగా ప్యాలెస్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా తీశారు.
నాలుగు ఎకరాలలో ఉన్న పైగా ప్యాలెస్.. సీఎం భద్రతకు సంబంధించి అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పైగా ప్యాలెస్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే సచివాలయానికి ఐదు నిమిషాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సీఎం చేరుకుంటాడని అధికారులు భావిస్తున్నారు.
బేగంపేటలోని పైగా ప్యాలెస్ పరిసరాల్లో ఎలాంటి రెసిడెన్షియల్ ఏరియాలేదు. దీంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవన్నది అధికారుల ఆలోచన. సీఎం కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ను ఆపకూడదని, ప్రజలతోనే ప్రయాణం చేద్దామని రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు.
జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు ఆలోచన చేశారు. అయితే జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి ఇనిస్టి ట్యూట్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియా ఉంది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక.. అధికారుల చూపు పైగా ప్యాలెస్ పై పడింది. ఇక్కడైతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు భావిస్తున్నారు. పైగా ప్యాలెస్ హెచ్ఎండీఏ స్వాధీనంలో ఉంది. ఆరో నిజాం నవాబు పైగా ప్యాలెస్ ను కట్టించాడు. ఇక్కడ పైగా ఫ్యామిలీ ఉండడంతో ఈ ప్యాలెస్ కు పైగా ప్యాలెస్ అని పేరు పెట్టారు.