Bandru Shobha Rani: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘బహిరంగంగా సభలో ఉచిత బస్సు సౌకర్యంపై బ్రేక్ డాన్సులు.. లేదా ఏమైనా చేసుకోమంటూ మహిళలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసి లోపల విచారం వ్యక్తం చేసినట్లు నటిస్తే ఎలా ? అంటూ ప్రశ్నించారు. తప్పు ఒప్పుకోవడానికి మంది మార్బలంతో మహిళా లీడర్లతో మహిళా కమిషన్ ముందు కేటీఆర్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చట్టాలను గౌరవించే వాళ్లు.. సంస్కారం ఉన్నోడు ఎవడైనా దాడికి పోయినట్టు కమిషన్ ముందు హాజరవుతారా? మహిళల చేత గొడవ చేయిస్తారా ?. కేటీఆర్ కు సంస్కారం ఉందో లేదో దీన్ని బట్టే అర్థమవుతుందని ఆమె విమర్శించారు.
Also Read: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ
మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని,దీంతో ఎంతోకొంత ఆర్థికంగామహిళలకు లాభం జరుగుతుందన్నారు. ప్రభుత్వం పట్ల మహిళల సానుకూలత చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం సంస్కారహీనంగా ప్రవర్తిస్తుందని ఆమె ఆరోపించారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలే ధ్యేయంగా బతుకుతున్నారన్నారు. పేద వర్గాలను పీల్చి పిప్పి చేసి అప్పుల రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు. మీరైతే ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించవచ్చు.. అధికారం అడ్డం పెట్టుకొని రూ. వేలకోట్లు దోచుకోవచ్చు.. పేద మహిళలు మాత్రం ఉచితంగా బస్సు సౌకర్యం కూడా పొందవద్దా అని కేటీఆర్ ని ఆమె ప్రశ్నించారు.
Also Read: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి.. వెంటనే చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక అనేక కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా మహిళలు నిరసన తెలుపుతారని మహిళలను కించపరిస్తే ఊరుకోమని కేటీర్ హెచ్చరించారు. నువ్వు ఉద్యమాలు ఎక్కడ చేసినావ్ కేటీఆర్.? సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు పోరాటం చేశారని అన్నారు. నీ చెల్లె ఒక్కతే కాదు ఆడపిల్లలందరినీ గౌరవించాలన్నారు. సంస్కారం ఎలా ఉంటదో.. మేం నేర్పిస్తాం గాంధీభవన్ కి రా అంటూ ఆమె అన్నారు. దేశం కోసం,ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసి.. ప్రధానమంత్రి లాంటి పదవులను కూడా వదులుకున్న సోనియా గాంధీ కుటుంబం నాయకత్వంలో పనిచేస్తున్నాం.. జాగ్రత్త అని హెచ్చరించారు. బీఆర్ఎస్ శకం ముగిసింది.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని కేటీర్ ని హెచ్చరించారు.