Bandla Ganesh : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రాజకీయాల వల్ల జీవితంలో చాలా నష్టపోయానని ఆ ట్వీట్ లో బండ్ల గణేష్ పేర్కొన్నారు. తనకు రాజకీయాలతోనూ, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. అందరూ ఆత్మీయులే అంటూ ట్వీట్ చేశారు.
కొంతకాలం క్రితమే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు తనకు సంబంధం లేదంటూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ఎందుకు ఈ ట్వీట్ ఇప్పుడు చేశారనే చర్చ జరుగుతోంది. బండ్ల గణేష్.. పవన్ కల్యాణ్ అభిమాని కాబట్టి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
పెద్ద నిర్మాత అయినా సరే పవన్ కల్యాణ్ వీరాభిమానిగానే బండ్ల గణేష్ బాగా పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమా ఫంక్షన్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. టీవీ డిబేట్లలో చేసిన కామెంట్లు తీవ్ర వివాదాలు సృష్టించాయి. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు బండ్ల గణేష్. ఈ ధోరణితోనే టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుసుకున్నారు. ఇక ఆయన చేసే ట్వీట్స్ కూడా బాంబుల్లా పేలుతుంటాయి. తాజాగా బండ్ల గణేష్ రాజకీయాలపై చేసిన ట్వీట్ కూడా చర్చకు తెరతీసింది.
బండ్ల గణేష్ కొంతకాలం రాజకీయాల్లో తిరిగారు. ఒకప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణకు సన్నిహితుడిగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి నానా హడావిడి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాకుంటే పీక కోసుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ అప్పుడు తెలంగాణలో పెనుదుమారం రేపింది. ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో బండ్ల గణేష్ విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యారు. ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేష్ తాజా ట్వీట్ ఎందుకు చేశారనే చర్చ నడుస్తోంది. ఈ ట్వీట్ తో ఆయన తన దేవుడు జనసేనాని వెంట కూడా నడవరని స్పష్టమైపోయింది. జనసేనలో చేరనని చెప్పడానికే ఈ ట్వీట్ చేశారనే చర్చ నడుస్తోంది.