Bandla Ganesh : సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల పూర్తైన నేపథ్యంలో పాలనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా పాలన జరుగుతోందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు ప్రజాపథం వైపునకు దూసుకుపోతున్నారని కితాబిచ్చారు.
బీఆర్ఎస్ నేతలపై బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు ఈర్ష్య పీక్ స్టేజ్ కు చేరుకుందని విమర్శించారు. 100 రోజుల తర్వాత పప్పులు ఉడకడం కాదు బిర్యానీ కూడా ఉడుకుతుందని.. హరీష్ రావు అంటూ సెటైర్ వేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని అంటూ నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలపై కేంద్రంతో కొట్లాడారా? అంటూ ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. పాలనలో పారదర్శకత కోసం అవినీతి అధికారులను పక్కకు తప్పిస్తున్నారని తెలిపారు. నిజాయితీ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించి పరిపాలన చేస్తున్నారంటూ సీఎం రేవంత్ ను ప్రశంసించారు. పార్లమెంటు ఎన్నికలపై బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదని స్పష్టం చేశారు.
గతంలో రాష్ట్రపతి వస్తే స్వాగతం పలకడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదని బండ్ల గణేష్ గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి వచ్చినా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉందని స్పష్టంచేశారు. ఏ సమస్య ఉన్నా సామాన్యులు సచివాలయానికి వెళ్తున్నారని తెలిపారు. ప్రగతి భవన్ ను దళితుడైన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఇచ్చారన్నారు. తెలంగాణలో ఇన్ని మార్పులు జరుగుతుంటే హరీష్ రావు , కేటీఆర్ ఎందుకు ఇంతగా ఆగం అవుతున్నారని బండ్ల గణేష్ మండిపడ్డారు.