Bandi Sanjay : తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రగతి భవన్ ను టార్గెట్ చేస్తూ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగతి భవన్ తోపాటు కొత్త సచివాలయంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్లు కూల్చివేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించడం వివాదాన్ని రేపింది. కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని బండి స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సచివాలయాన్ని మారుస్తామని ప్రకటించారు. అలాగే ప్రగతి భవన్ ను కూడా ప్రజా దర్బార్గా మారుస్తామన్నారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాశంగా మారాయి.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. రోడ్లకు అడ్డంగా ఉన్న గుళ్లు, మసీదులు కూల్చేస్తామని కేటీఆర్ చెబుతున్నారని.. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఈ పని మొదలు పెట్టాలని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో నిజాం రాజ్యం పోవాలని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిగా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ తెలంగాణను ఎంఐఎంకు కట్టబెట్టాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తే తప్పకుండా ఓడిస్తామన్నారు. పాతబస్తీలో యువతకు, ఉద్యోగాలు, పాస్పోర్టులు ఎందుకు రావడంలేదో ఎంఐఎం నేతలు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా పాతబస్తీతో ఎందుకు సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.