Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండి సంజయ్ నిర్మల్ జిల్లా భైంసా నుంచి పాదయాత్ర చేపట్టేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాగే అక్కడ బీజేపీ బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. పాదయాత్ర కోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా బండి సంజయ్ను.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్నారు.
తాజాగా బండి సంజయ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. అక్కడ భారీగా సిబ్బందిని మోహరించారు. బండి సంజయ్ ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్రను ఎలాగైనా ప్రారంభించాలన్న పట్టుదలతో బండి సంజయ్ ఉన్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అటు పాదయాత్ర అనుమతి కోసం బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి అనుమతి వస్తేనే ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగనుంది. అటు బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు భైంసాకు భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భైంసాలో బీజేపీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంమీద బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభంకాకుండానే తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది.