Bandi Sanjay thanks to Modi for sanction of new railway project to Telangana: తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది. బడ్జెట్ కేటాయింపులలో అన్యాయం చేస్తోందంటూ తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ెస్ నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్న వేళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం తీవ్ర స్థాయిలో తన అధికారిక ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎనిమిది రైల్వే ప్రాజెక్టులు చేపట్టిందని..అందులో ఒక ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక రైల్వే వ్యవస్థ ఎంతగా ప్రగతి సాధించిందో అందరికీ తెలుసనని అన్నారు. ఇది మోదీ సంకల్ప దీక్షకు నిదర్శనం అన్నారు. దాదాపు 25 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనాల వ్యయంతో దేశం మొత్తం మీద 8 రైల్వే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని ఇది భవిష్యత్ భారత వికసిత భారత్ కు ఎంతో దోహదకారిగా ఉండబోతోందని అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు ఈశాన్య రాష్ట్రాలనుంచి కనెక్టివిటీ బాగా పెరుగుతుందని అన్నారు.
భవిష్యత్ అవసరాల కోసం
తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనించేలా చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరం అవుతుందని అన్నారు. ఎప్పుడూ నిధులు ఇవ్వడం లేదని కేంద్రాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్న నేతలు ఇప్పుడేమని సమాధానం చెబుతారు. గిరిజన ప్రాంతాలను కలుపుతూ సాగిపోయే ఈ మార్గం ద్వారా గిరిజనుల ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుందని..వాళ్ల ఉత్పత్తులకు దేశవ్యాప్త డిమాండ్ పెరుగుతుందని అన్నారు. ఇకనైనా కేంద్రంపై అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. తెలంగాణ ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి చేయడం వలనే ఇలాంటి భారీ తరహా ప్రాజెక్టు జరిగిందని అన్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉండే ఈ ప్రాజెక్టు నాలుగువేల కోట్లతో దాదాపు 200 కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ నిర్మాణం జరగబోతోందని..దీనితో రెండు తెలుగు రాష్ట్రాల దశ మారనున్నదాని అన్నారు.