అసలే బండి సంజయ్. బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. అలాంటి ఎంపీకి కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఊరుకుంటారా? లోక్సభలో ఓ రేంజ్లో రెచ్చిపోయారు బండి సంజయ్. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్కూ కలిపి హైడోస్ ఇచ్చారు.
భారతమాతను హత్య చేశారన్న వారి కళ్లు పీకి, బొందపెడతాడు నా నరేంద్ర మోదీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ బండి సంజయ్. ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభలో ఫ్లైయింగ్ కిస్లు ఇస్తారు.. కౌగిలించుకుంటారు.. కన్ను కొడతారు.. ఆయన వ్యవహార శైలి చూస్తే గజినీ గుర్తొస్తున్నాడని అన్నారు. ఏ కాంగీ.. బెంగాల్ కా దీదీ, ఢిల్లీ కా కేజీ, బిహార్ కా జేడీ, తెలంగాణ కా కేడీ.. అంటూ పంచ్లు వేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో డిపాజిట్ కూడా రాలేదని.. కాంగ్రెస్ పార్టీ జీరో అంటూ దెప్పిపొడిచారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.
నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ.. అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని.. అసలు లిక్కర్ దందాతో ఆ పార్టీ లీడర్లకే లింక్ ఉందని ఆరోపించారు బండి. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే.. నిత్యం భారత్మాతను ప్రార్థించే ఆర్ఎస్ఎస్ను నిక్కర్ పార్టీ అంటే పుట్టగతులు ఉండవంటూ సభలో ఆవేశంగా మాట్లాడారు ఎంపీ బండి సంజయ్. ఆర్ఎస్ఎస్ ప్రేయర్ను బండి చదివి వినిపిస్తుంటే.. లోక్సభలోని బీజేపీ ఎంపీలు బల్లలు చరుస్తూ ఎంకరేజ్ చేశారు.
కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్పైనా ఓ రేంజ్లో చెలరేగిపోయారు బండి సంజయ్. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సభలో చెప్పారని.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు బండి.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని.. ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే వారి కుటుంబ ఆస్తులు వందల రెట్లు పెరిగాయంటూ.. ఆ లెక్కలు చదివి వినిపించారు బండి సంజయ్. సీఎం కుమారుడి ఆస్తులే 400 రెట్లు పెరిగాయని.. సీఎం భార్య ఆస్తులు 1800శాతం పెరిగాయని.. రైతులకు ఆదాయం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
మోదీ సర్కారు తెలంగాణకు నిధులు ఇస్తుంటే.. వాటిని కేసీఆర్ ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందని దుయ్యబట్టారు. బియ్యం అమ్ముకున్నారు.. టాయిలెట్ పైసలు దోచుకున్నారు.. ఉపాధిహామీ నిధులు కొల్లగొట్టారు.. రైతులను ఆగం చేస్తున్నారు..అంటూ విరుచుకుపడ్డారు బండి సంజయ్.
మణిపూర్కు మోదీ రాలేదని అంటున్న బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ రాలేదని.. ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే రాలేదని.. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే వెళ్లలేదని.. యువత బలిదానాలు చేసుకుంటే స్పందించలేదంటూ.. కేసీఆర్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు బండి సంజయ్. ఏకంగా కేసీఆర్ను ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ మూడు పార్టీలూ ఒక్కటేనని.. ఇక్కడ పొత్తు అక్కడ పోరు చేస్తూ రాజకీయంగా డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్.