Adilabad Janagarjana Sabha : హిందుత్వానికి చిరునామా.. ధర్మానికి అడ్డా.. ఆదిలాబాద్ గడ్డ అంటూ.. బీజేపీ నేత బండి సంజయ్ ఆదిలాబాద్ లో నిర్వహించిన జన గర్జన సభలో మాట్లాడారు. ఈ సభకు హోంమంత్రి అమిత్ షా(Amit Shah), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), ఈటల రాజేందర్ (Etela Rajendar), తరుణ్ చుగ్ (Tarun Chugh)తదితరులు హాజరయ్యారు. ఆదిలాబాద్ లో జరుగుతున్న ఈ సభ వేదికగా.. అన్నా కేసీఆర్ కు ఏమైందే.. మీకేమైనా కనిపించారా ? అని అక్కడికి వచ్చిన వేలాదిమంది ప్రజలను బండి సంజయ్ అడిగారు. ఆదిలాబాద్ సాక్షిగా కేసీఆర్ తన గురువు అని, ఆయన దగ్గరే భాష నేర్చుకున్నా అని చెప్పారు. కేసీఆర్ సార్ కు ఏమైంది? కేసీఆర్ ను మాకు చూపించాలి. కేసీఆర్ సార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని ఆశించారు. మా ముఖ్యమంత్రిని ఆయన కొడుకు ఏం చేస్తాడోనని ఇప్పటికీ భయంభయంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా తామెప్పుడూ ఎవరి నాశనాన్ని కోరుకోమన్నారు. సర్వేజనా సుఖినో భవంతు అని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఉద్ఘాటించారు. వచ్చేది మోదీ రాజ్యం, రామరాజ్యం అని బండి సంజయ్ ఆదిలాబాద్ వేదికగా చెప్పారు.
వచ్చే రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరని, అలాంటి ప్రయత్నాలు చేసినవారు మాడి మసైపోతారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అసలెందుకు ఓటెయ్యాలని బండి సంజయ్ ప్రశ్నించారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలు, 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లైతే ఆ పార్టీకే ఓటు వేయవచ్చన్నారు. ప్రతినెలా 1వ తేదీ జీతాలిచ్చి, ప్రమోషన్లు ఇస్తే బీఆర్ఎస్ కే ఓటు వేయాలన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుల సబ్సిడి ఆపకపోతే, పేద ప్రజలకు పట్టాలిస్తే, నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తే, అత్యాచారం జరిగిన మహిళలకు న్యాయం జరిగితే ఆ పార్టీకే ఓటు వేయమని.. బీఆర్ఎస్ ను చెడుగుడు ఆడుకున్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అయినందుకు 30 లక్షల మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. గ్రూప్ -1 నోటిఫికేషన్లు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి లేదు.. పైగా రాష్ట్ర ప్రజలపై బీఆర్ఎస్ సర్కార్ 5 లక్షల కోట్ల రుణభారం మోపిందని విమర్శించారు.
కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వేసిన ట్రైలర్ హిట్టైంది కానీ.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిచేది తామేనని, అధికారంలోకి వచ్చేది తమపార్టీనేనని చెబుతున్న కాంగ్రెస్.. కేసీఆర్ చేసిన 5 లక్షల కోట్ల రూపాయల అప్పును ఏ విధంగా తీరుస్తుందన్నారు. తెలంగాణ అప్పు తీరాలంటే.. నరేంద్ర మోదీ నేతృత్వంలో పేదల ప్రభుత్వం రావాలన్నారు. భైంసాలో జరిగిన అల్లర్లను ఎప్పటికీ మరచిపోబోమన్నారు. భైంసాలో అల్లర్లు, దాడులు, విధ్వంసానికి కారణమైన వారిని బజారులో బట్టలూడదీసి ఉరికించే మోదీ రాజ్యం రావాలన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేతను నడిరోడ్డుపై ఉరికించి ఉరికించి కొడతామన్నారు.