Bandi Sanjay: బీజేపీ దూకుడు ఆగట్లేదు. మునుగోడులో ఓడినా, ఫాంహౌజ్ కేసు వెంటాడుతున్నా.. తగ్గేదేలే అంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో మోదీ స్పీచ్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ జోష్ కంటిన్యూ అయ్యేలా.. కమలదళం జనంలోకి పయణమవుతోంది.
ఈ నెల 28 నుంచి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కానుంది. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. డిసెంబర్ 15 లేదా 16 వరకు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్లో ముగింపు సభ ఉంటుందని బీజేపీ ప్రకటించింది. ఇప్పటి వరకు 4 విడతల్లో, 21 జిల్లాల పరిధిలో 1,178 కి.మీల మేర బండి సంజయ్ పాదయాత్ర చేశారు.
మరోవైపు, బండి జోరుకు తోడుగా.. బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈనెల 26 నుంచి ‘ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్ర’ పేరుతో బైక్ ర్యాలీ జరగనుంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఒకటి లేదా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేయనున్నారు. ఎక్కడికక్కడ 200 బైక్లతో 10 నుంచి 15 రోజుల పాటు బైక్ ర్యాలీలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. స్థానిక సమస్యలపై ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్లు ఉండనున్నాయి.
మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు, జడ్చర్ల, షాద్నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్దన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్టు బీజేపీ ప్రకటించింది.