Telangana BJP news(Telugu news headlines today) : బండి సంజయ్.. దూకుడుగా వెళ్లే లీడర్..తెలంగాణ బీజేపీకి కొత్త ఊపిర్లుదీన నేత.. పంచాయితీకైనా.. ప్రమాణానికైనా.. ముందుంటారాయన.. పవర్ ఫుల్ డైలాగ్లు వదలడంలో ఆయనకు ఆయనే సాటి.. బండి డైలాగ్ వార్కు దిగితే ఒక్కోసారి చెవుల్లోంచి రక్తం కూడా కారుతుందనేలా మాటలు పేలుస్తారనేది పొలిటికల్ టాక్.. అలాంటి బండి సంజయ్ ఫ్యూచర్ ఏంటనే డైలమా నెలకొంది. తెలంగాణ బీజేపీ ఇంజిన్గా పనిచేసిన సంజయ్కు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈనోటా .. ఆనోటా.. జరిగిన ప్రచారమే నిజం కావడంతో భావోద్వేగ ట్వీట్ పెట్టడం మినహా మిన్నకుండిపోయారు. అసలే క్రమశిక్షణ కలిగిన పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ నేతగా తనను ఎందుకు తప్పించారని ప్రశ్నించే సాహసం చేయడం కూడా సాధ్యం కాదు. అయితే బండిని ఎలా ఊరడిస్తారనేదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీస్తోంది..
తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బండి సంజయ్ భారీగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. పెద్దపెద్ద లీడర్లు అనుకునే వాళ్లందర్నీ పార్టీలో చేర్చారు. అంతటితో ఆగకుండా తన పలుకుబడితో వాళ్లందర్నీ స్వయంగా ఢిల్లీ తీసుకెళ్లారు. ఆ తర్వాత బండి సాయం లేకుండానే ఆ లీడర్లు నేరుగా హైకమాండ్ దగ్గరకు వెళ్లారు. ఇంకేముందు కోరి తెచ్చుకున్న వాళ్లే బండికి కొరకరాని కొయ్యగా మారారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వాళ్లంతా కలిసే బండి సంజయ్ ఇంజిన్ను ఊడగొట్టారనే టాక్ వినిపిస్తోంది. కిషన్రెడ్డికి మరోసారి అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు దగ్గాయి. ఇక మిగిలింది బండి సంజయ్.. కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్న బండికి ఎలాంటి పదవి దక్కనుందనే చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా.. లేదంటే తెలంగాణలో మరేదైనా పొలిటికల్గా కీలక పోస్ట్ కేటాయిస్తారా అనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది..
బండి సంజయ్ ఇంకా ఢిల్లీలోనే ఉండిపోయారు. అధిష్టానం ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న బండికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా ఇచ్చారట. కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారా..? లేక వేరే కీలక బాధ్యతలు అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది. సంజయ్ కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. పార్టీకి కార్యకర్తలా పనిచేస్తానని అంటున్నారు. అయితే నియోజకవర్గం సమస్యలపై బండి దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర రైల్వే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు సహా తన నియోజకవర్గం పరిధిలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. కిషన్రెడ్డితో పాటు హైదరాబాద్ వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం వరకు వెళ్లారు. రైల్వే మంత్రి నుంచి ఫోన్ రావడంతో వెనక్కి వెళ్లిపోయారు.