Bandi Sanjay : TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార బీఆర్ఎస్, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలతో ఈ వివాదం మరింత హీటెక్కింది. దీంతో ప్రతిపక్షాలపై కేటీఆర్ ఎదురుదాడికి దిగారు.
కేటీఆర్ లీగల్ ఎటాక్..
తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్ కు, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో తనపై చేసిన ఆరోపణలను.. వారంలోగా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే 100 కోట్ల పరువునష్టం దావా ఎదుర్కునేందుకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు.
బండి కౌంటర్..
మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ పై ప్రశ్నలవర్షం కురిపించారు. మంత్రి కేటీఆర్ పరువు రూ. 100 కోట్లా? అని నిలదీశారు. మరి యువత భవిష్యత్తుకు మూల్యమెంత? అని ప్రశ్నించారు.
పేపర్ లీకేజీలో తన కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారని మరి అలాగైతే ఆయనపై ఎన్ని కోట్లకు దావా వేయాలి? అని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని మరోసారి కోరారు. కేటీఆర్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా పోరాడతామని బండి సంజయ్ హెచ్చరించారు.
కేంద్రానికి ఫిర్యాదు చేస్తా: కోమటిరెడ్డి
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్రహోంమంత్రిని కలుస్తామన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 వేలు ఖాళీలు కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తు చేశారు.