Bandi Sanjay : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు కౌంటర్ గా హైదరాబాద్ లో బీజేపీ నేతలు దీక్షకు దిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోస- బీజేపీ భరోసా’ పేరుతో ఈ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మహిళలు అభద్రతా భావంతో ఉన్నారని తెలిపారు. మహిళలు బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత వేధింపుల వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు 17 శాతం పెరిగాయని వివరించారు.తెలంగాణలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999, 2002లో మూడుసార్లు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బండి సంజయ్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణ కేబినెట్లో 3 శాతం కూడా మహిళా మంత్రులు లేరని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు అమలు కోసం ఢిల్లీలో దీక్షకు దిగిన ఎమ్మెల్సీ కవిత ముందు కేసీఆర్ను ప్రశ్నించాలన్నారు. ఢిల్లీలో కాదు.. హైదరాబాద్ ప్రగతిభవన్ ఎదుట ధర్నా చేయాలని సూచించారు.