Bandi Sanjay: కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్, కవితలకు కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తాయని బండి సంజయ్ కూడా చెప్పారు.
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని, కేసీఆర్ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని, కేటీఆర్ను పీసీసీ చీఫ్ చేస్తే.. హరీశ్ రావుకు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయంగా దక్కుతాయని బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాదు, త్వరలో రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయని గుర్తు చేస్తూ కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇతర కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ఎందుకు అరెస్టు చేయడం లేదని అనుమానించారు. గతంలోనూ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్కు ఉన్నదని, మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్కు ఉన్నదని బండి సంజయ్ పేర్కొన్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్టు బండి సంజయ్ పేర్కొన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది కోర్టు పరిధిలోని అంశమని వివరించారు. అంతేకానీ, కవిత బెయిల్కు బీజేపీకి ఏ సంబంధమని ప్రశ్నించారు. అలాగంటే.. మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, ఆప్ ఏమైనా బీజేపీలో విలీనమైందా? అని అడిగారు. బీజేపీపై బురదజల్లడానికే కాంగ్రెస్ నేతలు దిగజారిమాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Also Read: KTR: కేటీఆర్కు నోటీసులు.. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశం
బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయమని, అలాంటి పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకోవాల్సిన ఖర్మ ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని తహతహలాడుతున్నదన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ విలీనం ఖాయమని చెప్పారు.