Bandi Sanjay: కేసీఆర్ కూతురు కవిత ధరించే వాచ్ విలువ 25 లక్షలు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమెనే చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ సరిగ్గా క్యాచ్ చేసింది. కవిత వాచ్కు ఉన్నంత విలువ కూడా.. వైద్య విద్యార్థిని ప్రీతి ప్రాణాలకు లేదా? అని నిలదీశారు బండి సంజయ్. ప్రీతి చనిపోతే 10 లక్షలు ఆర్థిక సాయం మాత్రమే ప్రకటించారని మండిపడ్డారు.
ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. శవానికి ట్రీట్మెంట్ చేస్తూ సినిమా చూపించారని విమర్శించారు. ప్రీతి సెల్ఫోన్ డేటా డిలీట్ చేశారని.. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటి వరకూ స్పష్టత లేదన్నారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ.. వాటికి వ్యతిరేకంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 4 గంటల పాటు నిరసన దీక్ష చేశారు బండి సంజయ్. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. నిమ్మరసం ఇచ్చి సంజయ్ దీక్షను విరమింపజేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ను ఖండిస్తూ నలుగురు సీఎంలు, విపక్ష నేతలు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. కేసీఆర్ ఇతరులతో కలిసి లేఖ రాస్తే.. ఆయన అవినీతిపై కోటి మందితో సంతకాలు సేకరిస్తామని హెచ్చరించారు బండి సంజయ్.