Bandi Sanjay: సమయం చూసి బండి సంజయ్ను మూసేసింది సర్కారు. శనివారం ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారు. పలు ప్రారంభోత్సవాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరపనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. సరిగ్గా ఇదే టైమ్లో టెన్త్ పేపర్ లీక్ అవడం.. ఆ పేపర్ను బండికి పంపించారనే సాకుతో.. అర్థరాత్రి నానాహంగామా చేసి సంజయ్ను అరెస్ట్ చేసి.. జైలుకు పంపించారు. 14 రోజుల రిమాండ్తో బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోదీ మీటింగ్కు ముందు ఇదేంటని ఆందోళన చెందుతోంది.
బండి సంజయ్ను ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురావాలని బీజేపీ లీగల్ సెల్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేసింది. బండి రిమాండ్ను రద్దు చేయాలంటూ కోర్టును కోరింది. పరీక్ష ప్రారంభం అయ్యాక.. లీక్ ఎలా అవుతుందని ప్రభుత్వ తరఫు లాయర్ను ప్రశ్నించింది హైకోర్టు. ఓ రాజకీయ నేతగా బండి సంజయ్ ఆ పేపర్ను సర్క్యులేట్ చేయడం తప్పెలా అవుతుందని అడిగింది. బండి సంజయ్కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ అడ్వొకేట్ కోర్టుకు తెలపడంతో.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసును సోమవారానికి వాయిదా వేసింది.
శుక్ర, శని, ఆది కోర్టుకు సెలవులు. శనివారమే మోదీ మీటింగ్. అందుకే బీజేపీ తరఫు లాయర్లు హైకోర్టులో గట్టిగానే వాదించారు. రిమాండ్పై ఆర్డర్ తప్పని.. బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళే ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని.. ఎల్లుండి ప్రధాని పర్యటన ఉందని.. కోర్టును కోరారు.