Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ బీజేపీ. చిన్న మీటింగ్కు కూడా అధిష్టానం నుంచి అగ్రనేతలను దింపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ వంటి దిగ్గజ నేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించి జనాలకు హామీల మీద హామీలు గుప్పించారు.
ఇక త్వరలోనే రాష్ట్రంలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఈ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నేతలున్నారన్నారు. రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు 300 సీట్లు దాటిందని తెలిపారు.
తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్మమని వెల్లడించారు.