హైదరాబాద్, స్వేచ్ఛ: భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ పై నాంపల్లి కోర్టు న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ మిమ్మల్ని కోర్టుకు రావలసిందిగా బొట్టిపెట్టి పిలవాలా? సమన్లు ఇస్తే కోర్టుకు రారా? అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పట్లో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీపై ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీపాదాస్కు కాంగ్రెస్ నాయకులు కారును గిఫ్ట్ గా ఇచ్చారని , డబ్బులు కూడా తీసుకుని కొందరికి ఎంపీ టిక్కెట్లు ఇచ్చారని ప్రభాకర్ ఆరోపించారు. పదవిని అడ్డుపెట్టుకుని దీపాదాస్ క్విడ్ ప్రో కు తెరతీశారని అనుచిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ప్రభాకర్.
రూ.10 కోట్ల పరువు నష్టం దావా
తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ పై నాంపల్లి కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు దీపాదాస్ మున్షీ. దీనిపై నాంపల్లి కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ విచారణకు ప్రభాకర్ గైర్హాజర్ అయ్యారు. ప్రభాకర్ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఆఖరు అవకాశం అని ఈ సారి చెప్పిన తేదీకి కోర్టుకు హాజరు కాకుంటే న్యాయపరమైన కఠిన చర్యలు ఉంటాయని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన విచారణను నవంబర్ 5కి వాయిదా వేశారు. ఎట్టి పరిస్థితిలోనూ నవంబర్ 5న ప్రభాకర్ హాజరుకావలసిందేనని నాంపల్లి కోర్టు జడ్జి హెచ్చరించడం గమనార్హం. దీపాదాస్ మున్షీ తరపున జంధ్యాల రవిశంకర్ తన వాదనలను కోర్టుకు వినిపించారు.