Bhadradri: పోడు భూముల వివాదం ఫారెస్ట్ రేంజర్ హత్యకు దారి తీసింది. ఎన్నాళ్లుగానే సాగుతున్న వ్యవహారంలో పరిష్కారం రాకపోవడంతో గుత్తికోయలు రెచ్చిపోయారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులపై తిరగబడ్డారు. కత్తులతో దాడి చేయడంతో రేంజర్ శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడులో.. అటవీశాఖ నాటిన మొక్కలు తొలగించేందుకు పోడు భూముల సాగుదారులు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై గిరిజనులు మూకుమ్మడిగా దాడి చేశారు. భయపడిన సెక్షన్ అధికారి రామారావు అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడే ఉన్న ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై అడవి బిడ్డలు ఆటవికంగా కత్తి, వేట కొడవలితో దాడి చేశారు.
గిరిజనుల దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో కత్తి వేటు పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే శ్రీనివాసరావును చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.