Hyderabad Today News(Local news telangana) : హైదరాబాద్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు మూడు క్రైమ్ ఘటనలు జరిగాయి. ఒక ఘటనలో బీర్ బాటిల్ ఇవ్వనందుకు కత్తితో పొడిచారు. ఈ ఘటనలో వరప్రసాద్ అనే వ్యక్తి చనిపోయాడు. అతనిపై స్నేహితులైన నితీష్, కిరణ్, సంతోష్, పవన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. రాత్రి బీర్ బాటిల్ తీసుకుని వరప్రసాద్ జిల్లెల గూడ నుంచి వెళుతుండగా.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్ కొంతమంది యువకులు అతన్ని అడ్డుకున్నారు. బీరు బాటిల్లు ఇవ్వాలని దబాయించారు. సాయి వర ప్రసాద్ ఇవ్వకపోవడం తో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పల్లె నితీష్ గౌడ్ తన దగ్గరున్న కత్తితో సాయి వర ప్రసాద్ పై దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు సాయివర ప్రసాద్.
మరో ఘటనలో బీరు సీసాలతో బీజేపీ కార్యకర్తపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బోనాల పండుగ సందర్భంగా బీజేపీ దిమ్మకు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కట్టడంతో ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్త తొలగించారు. దీంతో మరుసటి రోజు ఇంటికి పిలిపించుకొని మూకుమ్మడిగా దాడి చేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు. బీజేపీ కార్యకర్త పై చేసిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానిక కార్పొరేటర్ భర్త ఆనంద రెడ్డి ప్రోత్బలంతోనే తనపై దాడి చేయడం జరిగిందని బాధితుడు సుధీర్ రెడ్డి అన్నారు.
మరో ఘటనలో రెండు వర్గాల మధ్య సిగరెట్ల కోసం గొడవ జరిగింది. ఆ ఘటన కూడా సీసీ కెమెరాలో రికార్డయింది. ఒకేరోజు మూడు నేరాలు జరిగాయి. ఇంత జరుగుతున్నా మీర్ పేట్ పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేపట్టకపోవడంతో అర్ధరాత్రి మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోతున్న పరిస్థితి నెలకొంది.