Hyderabad : హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇరుగు పొరుగు వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అయితే ఆ గొడవలే ఓ వ్యక్తి మరణానికి కారణమైయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్ సత్యనగర్ కాలనీలో శ్రీనివాస్, నాగరాజు పక్కపక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. నాగరాజు హోంగార్డుగా పని చేస్తున్నాడు.
బాధిత కుటుంబం కథనం ప్రకారం.. హోంగార్డ్ నాగరాజు పిస్టల్తో శ్రీనివాస్(55)ను బెదిరించాడు. దీంతో అతడు భయపడి పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీనివాస్ మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు హోంగార్డ్ ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్ మృతికి నాగరాజే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నాగరాజు పిస్టల్ తో బెదిరిస్తూ శ్రీనివాస్ ను వేధించారని తెలిపారు. ఆ వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు అంటున్నారు.
మృతుడి కుటుంబం చేస్తున్న ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులకు, కుటుంబ సభ్యులకు నచ్ఛచెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హోంగార్డు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. 3 ఏళ్లుగా మృతుడు శ్రీనివాస్ కు నిందితుడు నాగరాజుకు మధ్య గొడవలు ఉన్నాయి.