Arvind VS Kavitha : తెలంగాణ రాజకీయం ఒక ఎత్తు.. నిజామాబాద్ పాలిటిక్స్ మరో ఎత్తు అన్నట్టు ఉన్నాయి అక్కడి రాజకీయ పరిస్థితులు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటలయుద్ధం ఓ రేంజ్కు చేరింది. ఎంతలా అంటే.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు చేసుకునేవరకు వెళ్లింది.
తెలంగాణ భవన్ వేదికగా BRS అధినేత కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై సైటెర్లు వేశారు ఎంపీ అర్వింద్. ముఖ్యంగా కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమా పేరుతో ఇచ్చిన హామీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారాయన. మనిషి బతికున్నప్పుడే ఏదైనా సాయం చేయాలి కానీ.. చనిపోయాక డబ్బులు ఇస్తారంట అంటూ అర్వింద్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై కూడా ఘాటు విమర్శలు చేశారు.
అర్వింద్ మాటల్ని బీఆర్ఎస్లోని మిగతా నేతల కంటే కవిత ఎక్కువ సీరియస్గా తీసుకుంది. తన తండ్రిపై, అన్నపై, తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని.. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కవిత ప్రశ్నించారు. ఆడబిడ్డనని కూడా చూడకుండా తనని నోటికొచ్చినట్టు మాట్లాడారని అర్వింద్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కవిత.
అర్వింద్ మాటకు కవిత కౌంటర్తో విషయం ముగిసిపోలేదు. చరిత్రను తవ్వితీశారు ఎంపీ అర్వింద్. హైదరాబాద్లోని తన ఇంటిపై బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని గుర్తుచేశారు. ఆ సమయంలో తన తల్లి ఒక్కరే ఇంట్లో ఉన్నారని.. ఆడబిడ్డ అనే విషయం కవితకు గుర్తురాలేదా అంటూ.. ఎటాక్ జరిగిన ఇంటి నుంచే రిప్లై ఇచ్చారు అర్వింద్.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా అర్వింద్, కవిత మధ్య మాటల దాడి జరుగుతూనే ఉంది. పసుపు బోర్డు ఏమైందనే దగ్గర నుంచి కవిత అర్వింద్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బీజేపీ ఎంపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తనదైన శైలిలో కవితకు కౌంటరిస్తూనే ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రభావం పడేలా కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ అసెంబ్లీ బరిలోకి దిగనుండడంతో ఈ వేడి కాస్త పీక్స్కు చేరింది. కేసీఆర్ వస్తున్నారనే జోష్లో గులాబీదళం ఉండగా.. పసుపు బోర్డు సాధించిన ఉత్సాహంలో కమలం కార్యకర్తలు ఉన్నారు. అర్వింద్, కవిత కూడా అదే రేంజ్లో మాటలకు పదును పెడుతున్నారు.