Telangana: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు కామన్. ధర్నాలు, నిరసనలూ అంతే కామన్. అవి ప్రజాస్వామికం కూడా. అంతేకానీ, కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టడాలు మాత్రం అస్సలు కామన్ కాకూడదు. కానీ, తెలంగాణలో అలా జరుగుతోంది. ప్రశ్నిస్తే కేసు. నిలదీస్తే కేసు. ఎదురు తిరిగితే జైలు.. అన్నట్టుగా సాగుతోంది పాలనా తీరు. కేంద్రం తమను టార్గెట్ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసే తెలంగాణ సర్కార్.. మరి తాను చేస్తున్నది ఏంటి? విపక్షాలను వెంటాడుట లేదా? ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి.. జైల్లో పెట్టడాన్ని ఏమనాలి?
ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై పోలీసులు వ్యవహరించిన తీరు మరీ సిల్లీగా ఉందనే విమర్శలు ఉన్నాయి. టెన్త్ పేపర్ బయటకు వస్తే.. అంతా సంజయే చేశారంటూ ఏకంగా ఏ1గా కేసు పెట్టడం దారుణం అంటున్నారు. ఏదో పెట్టారే అనుకున్నా.. ఓ ఎంపీని రాత్రికి రాత్రి.. అత్తారింట్లోంచి ఎత్తుకొచ్చి.. నాలుగు జిల్లాలు దాటించి.. జైలుకు పంపడం మరింత దుర్మార్గం అనేది కమలనాథుల ఆరోపణ. ఎవరో పరీక్ష పేపర్ను బయటకు తీసుకొస్తే.. బండి సంజయ్ను లోపలేయడం దారుణమైన అణచివేత అంటూ మండిపడుతున్నారు.
బండి అనే కాదు.. రేవంత్రెడ్డి విషయంలోనూ ఇంతే. ఇటీవల చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశాక.. సర్కారు తనను ఎలా టార్చర్ చేస్తోందో చెబుతూ రేవంత్ లాంటి నాయకుడే కన్నీరు పెట్టారంటే మామూలు విషయమా? కేటీఆర్ ఫామ్హౌజ్ విజువల్స్ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారనే ఆరోపణతో ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టడం.. అందులోనూ ఉగ్రవాదులను, కరుడుగట్టిన నేరస్తులను బంధించే సెల్లో వేయడాన్ని ఏమనుకోవాలి? రాత్రంతా నిద్రపోకుండా లైట్ వేసే ఉంచడం, ఆ వెలుతురుకు లైట్ పురుగులు రావడం.. ఇలా తాను అనుభవించిన బాధను ఆవేదనతో చెప్పారు రేవంత్రెడ్డి. జైల్లో పెడితే లొంగుతానా? ఆస్తులన్నీ అమ్మేసైనా కేసీఆర్ సంగతి చూస్తా.. అంటూ మరింతగా రాజకీయ సవాల్ చేశారు పీసీసీ చీఫ్. రేవంత్ స్పీచ్ తర్వాత.. బీఆర్ఎస్ పాలనలో దమననీతిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆ చర్చ అలా నడుస్తుండగానే.. షర్మిలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మరింత సంచలనం.
షర్మిలను కనీసం ఇంటి నుంచి కూడా బయటకు రానీయలేదు పోలీసులు. పిల్లిని గదిలో బంధిస్తే ఊరుకుంటుందా? తిరగబడదా? తానూ అదే చేశాననేది షర్మిల వెర్షన్. అయితేనేం, పోలీసులను కొట్టారనే కేసులో షర్మిలపై నాలుగు కేసులు పెట్టి.. అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు. గతంలో కేటీఆర్, హరీశ్రావులు పోలీసులను తిట్టలేదా? కొట్టలేదా? వారిపై చర్యలు ఉండవు కానీ.. ఓ మహిళనైన తాను ఆత్మ రక్షణ కోసం దాడి చేస్తే జైల్లో పెడతారా? అంటూ షర్మిల మండిపడటం చూశాం. నేలకు కొట్టిన బంతిలా బౌన్స్ అవుతానని.. బోనులో పెట్టినా పులి పులేనని.. రాజశేఖర్రెడ్డి బిడ్డ తగ్గేదేలే.. అంటూ.. కేసీఆర్ ఇంతకుఇంత అనుభవిస్తారంటూ.. షర్మిల సవాల్ చేయడం మరింత ఆసక్తికరం.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఏకంగా పీడీ యాక్ట్ పెట్టి వారాల తరబడి జైల్లో బంధించారు. ఆఖరికి క్యూ న్యూస్తో ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ను బలంగా వినిపిస్తున్న తీన్మార్ మల్లన్నను పలుమార్లు జైల్లో పెట్టి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఇలా.. ఎవరు గట్టిగా మాట్లాడితే.. వారిని జైల్లో పెట్టడమేనా? ఇదేమి రాజ్యం? తెలంగాణలో అరెస్టుల రాజ్యం నడుస్తోందంటూ విపక్ష పార్టీలన్నీ కేసీఆర్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఓడిపోతారనే భయంతోనే గులాబా బాస్ ప్రస్టేషన్కు గురవుతున్నారని.. అందుకే కేసులు, అరెస్టులతో ప్రతిపక్షాలను బెదిరించాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే.. కేసులు పెట్టి జైలుకు పంపినా.. ఆ నేతలంతా మరింతగా ప్రభుత్వంపై పోరాడుతున్నారు కానీ.. ఎక్కడా తగ్గట్లే. కేసీఆర్ను వదలట్లే. మరి, ఇలా విపక్షంపై ఉక్కుపాదం మోపి సర్కారు ఏం సాధించినట్టు? ప్రజల్లో మరింత బద్నామ్ కావడం మినహా ఇంకేం మిగిలినట్టు? అంటున్నారు.