Armur Janasabha : తెలంగాణలో మూడవ రోజు కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర జరుగుతోంది. మంథని, జగిత్యాల మీదుగా ఆర్మూర్ కు చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ నిర్వహించిన జనసభలో మరోమారు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు పూనుకోకపోయుంటే.. తెలంగాణ ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదన్నారు. ప్రజల తెలంగాణ ఏర్పాటు చేయాలని సోనియా అనుకున్నారు కాబట్టే.. ఈనాడు తెలంగాణ ఇలా ఉందన్నారు.
తెలంగాణలో ప్రజల రాజ్యం, ప్రజారాజ్యం నడుస్తుందని.. రైతుల, చిన్న వ్యాపారుల గొంతు వినిపిస్తుందనుకున్నాం కానీ.. ఇక్కడ కుటుంబ పాలన జరుగుతోందని విమర్శించారు.
ఆర్మూర్ కు వచ్చే దారిమధ్యలో ఓ టీ దుకాణం వద్ద ఆగగా.. అక్కడున్న ఒక వ్యక్తి తమకు కరెంట్ బిల్లు వేలకు వేలు వస్తుందని వాపోయారని రాహుల్ తెలిపారు. అలాగే టీ దుకాణంలో ఉన్న వృద్ధురాలు తమకు వచ్చే రూ.2000 సరిపోవడం లేదని తనకు మొరపెట్టుకున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. అలాగే.. వృద్ధులకు, ఒంటరి మహిళలకు నెలవారీ పెన్షన్ రూ.4000 ఇస్తామన్నారు. 10 లక్షల రూపాయల వరకూ వైద్య భీమా అందిస్తామని తెలిపారు.
బస్సుపై ఉండి మాట్లాడుతున్న రాహుల్ అక్కడే ఉన్న ఒక మహిళతో మాట్లాడి.. బస్సులో వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుందని అడిగారు. ఆమె పేరే హరిత. అధిక ధరలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ కు, విద్యకు, ఆర్టీసీ బస్సులకు ప్రతీ దానికి డబ్బులు కావాల్సిందే. అందుకే మహాలక్ష్మి పథకం తెచ్చాం. మహాలక్ష్మి పథకం కింద ప్రతినెల ప్రతి ఇంటి మహిళ ఖాతాలో రూ.2500 వేస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రాహుల్ గాంధీ ఆరు హామీలను వివరించారు.