Hyderabad : “నిన్నే ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటాను.. నన్ను నమ్ము” అని చెప్పి ఒక యువతిని మాయమాటలతో లొంగదీసుకుని.. ముఖం చాటేశాడో ఏఆర్ కానిస్టేబుల్. దాంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని రామ్ గోపాల్ పేట్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. కార్వాన్ కు చెందిన సాయికుమార్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తరచుగా బేగంపేట ఎయిర్పోర్టుకు సాయికుమార్ బందోబస్తు కోసం వెళ్లేవాడు. బేగంపేట ప్రకాష్ నగర్ కు చెందిన శ్రీజ ఎయిర్పోర్టులో కాంట్రాక్ట్ సూపర్ వైజర్గా పనిచేస్తుంది.
బందోబస్తు విధుల కోసం ఎయిర్ పోర్టుకు వచ్చే సాయికుమార్ కు శ్రీజతో పరిచయం ఏర్పడింది. శ్రీజని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సాయికుమార్ ను నమ్మింది. ఆమె పూర్తిగా తనను నమ్మిందని భావించి సాయి కుమార్ మినిస్టర్ రోడ్డులో ఉన్న బృందావన్ హోటల్ కు రావాలని కోరాడు. అక్కడ ఏకాంతంగా మాట్లాడుకోవచ్చని చెప్పాడు.
ఇలా హోటల్ కు అనేకసార్లు రప్పించి ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత శ్రీజ.. సాయికుమార్ ను పెళ్లి చేసుకోవాలని కోరగా రేవు మాపు అంటూ తప్పించుకుని తిరిగాడు. దీంతో సాయి కుమార్ మోసం చేశాడని గ్రహించిన శ్రీజ.. రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.