హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సెప్టెంబర్ 26, అక్టోబర్ ఒకటి, మూడు తేదీలతో ఇచ్చిన ఉత్తర్వులను ఆదివారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో జిల్లా స్థాయిలో పనిచేసి తగిన గుర్తింపుకోసం ఎదురుచూస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులకు తగిన గుర్తింపు లభించినట్లయింది.
జనవరి 5న రద్దు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన 33 జిల్లాల గ్రంధాలయ సంస్థల ఛైర్మన్లను, సభ్యులను తొలగిస్తూ ప్రభుత్వం 2024 జనవరి 5న జీవో జారీ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఈ పదవుల నియమకానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం 13 జిల్లాలకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా, ఆయా జిల్లాల ఛైర్మన్లకు స్థానిక జిల్లాల ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేడర్లో జోష్..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా, ఇంకా జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కక పోవడంతో నిరాశకు లోనైన కేడర్ దసరా పండుగ సందర్భంగా వచ్చిన ఈ ప్రకటన కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఇదే ఊపులో మిగలిన ఇరవై జిల్లాలకూ గ్రంథాలయ ఛైర్మన్లు, సభ్యుల నియమాకంతో బాటు ఆర్టీఏ మెంబర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, దేవాలయ కమిటీల పాలక మండళ్లు, తదితర అనేక పదవులు భర్తీ చేయడానికి గాంధీ భవన్ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
నియామకమయ్యింది వీరే…
నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ
సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్
కరీంనగర్- సత్తు మల్లయ్య
రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి
వనపర్తి – జి. గోవర్ధన్
సంగారెడ్డి- గొల్ల అంజయ్య
కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి
మెదక్- సుహాసిని రెడ్డి
నారాయణ్పేట్ – వరాల విజయ్ కుమార్
నాగర్ కర్నూల్ – జి. రాజేందర్
వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి
మహబూబ్నగర్- మల్లు నరసింహారెడ్డి
జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు