తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ఆబ్కారీశాఖ దరఖాస్తులను శుక్రవారం నుంచి స్వీకరించనుంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 3 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. దరఖాస్తు ఫీజు, దుకాణాల లైసెన్స్ ఫీజు కింద రూ. 2 వేల కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది.
మద్యం దుకాణాల టెండర్లకు తాజాగా సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సు ఇచ్చేందుకు ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30కి ముగియనుంది. డిసెంబర్ నుంచి మద్యం షాపులకు కొత్తగా లైసెన్సులను మంజూరు చేస్తారు. జిల్లాల వారీగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వానికి నిధుల అవసరం ఉంది. అందుకే 3 నెలలు ముందుగానే మద్యం షాపుల లైసెన్సులకు నోటిఫికేషన్ను జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో నెల ముందు మాత్రమే రెన్యువల్స్ ఇచ్చేవారు. ఇప్పుడు 3 నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో సర్కార్ కు ఆగస్టులోనే లైసెన్సు ఫీజు మొదటి వాయుదా సొమ్ము అందుతుంది. దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఆ సొమ్మును ఎన్నికల ముందు ఏవైనా పథకాలకు వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది.
ఆగస్టు 4 నుంచి ప్రభుత్వం మద్యం షాపుల లైసెన్సు కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆగస్టు 18న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకుంటారు. ఆగస్టు 21న లాటరీ పద్దతిలో మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేస్తారు. ఈసారి కూడా దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షలుగా నిర్ణయించారు.
ఇప్పటికే మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ల ప్రక్రియను ఆబ్కారీశాఖ పూర్తి చేసింది. కొత్త మద్యం విధానం ప్రకారం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఎక్సైజ్ జిల్లాను యూనిట్గా తీసుకొని డ్రా పద్ధతి ద్వారా రిజర్వుడ్ దుకాణాలను ఎంపిక చేశారు.షెడ్యూల్ ప్రాంతాల్లో ఇదివరకే ఎస్టీలకు కేటాయించిన 95 దుకాణాలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించారు. ఈ దుకాణాలకు ఎస్టీలు మాత్రమే దరఖాస్తు చేయాలి.
షెడ్యూలు ప్రాంతాల్లోని 95 దుకాణాలు కాకుండా ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ల ప్రకారం మరో 36 దుకాణాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేశారు. మొత్తంగా రిజర్వేషన్ల ప్రకారం గౌడలకు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలు కేటాయించారు. 1,834 దుకాణాలను ఓపెన్ కేటగిరీగా ప్రకటించారు.