టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మొదలైంది. కేండిడేట్స్ కోసం మూడంచెల వడపోత విధానాన్ని అనుసరిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 18 నుంచి 25 వరకు జరగనుంది.
దరఖాస్తు విధివిధానాలను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఫీజు విషయంలోను సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పాటించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ అభ్యర్థులు 25వేలు, ఓసీలకు 50 వేల చొప్పున దరఖాస్తు ఫీజు ఖరారు చేశారు.
ఆశావహుల కోసం 4 పేజీల దరఖాస్తును గాంధీ భవన్లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత వివరాలతో పాటు, ప్రస్తుతం పార్టీలో హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, పొందిన పదవులు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ఎన్నికల్లో గెలుపు ఓటములు, విద్యార్థి, యువజన ఉద్యమాల్లో పాత్ర, సోషల్ మీడియా యాక్టివిటీతో పాటు క్రిమినల్ కేసులు, కోర్టు శిక్షలు, పోటీ చేయదలచిన సెగ్మెంట్.. ఇలా పలు వివరాలను దరఖాస్తులో తెలపాల్సి ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ తర్వాత పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రూటిని చేస్తుంది. అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందించి.. కేరళ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీకి అప్పగిస్తారు. స్క్రీనింగ్ కమిటీ మరోసారి అభ్యర్థుల బ్యాంగ్ గ్రౌండ్పై క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేరుగా అభ్యర్థులను పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు, ఆ సెగ్మెంట్లోని ప్రత్యర్థి పార్టీ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకున్న తర్వాత.. ప్రతీ నియోజకవర్గం నుంచి 3 పేర్లను సిఫారసు చేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందుకు వచ్చిన స్క్రీనింగ్ కమిటీ నివేదికను మరోసారి పరిశీలించి అభ్యర్థులను ప్రకటిస్తారు.
అయితే, ఏదేని నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ జాబితాను సీడబ్ల్యూసీ ముందు పెడతారు. అలాంటి సెగ్మెంట్ల అభ్యర్థుల ప్రకటన చివరి జాబితాలో ఉంటుంది. ఈ సారి పోటీ అధికంగా ఉండడం, సామాజిక న్యాయం చేయాల్సి ఉండడంతో.. ఈసారి అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సామే అంటున్నారు.