Shooting case : నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు దొంగతనం చేసిన బైక్ లను ఉపయోగించారని గుర్తించారు. ఆ వాహనాలతోనే బంగారం షాపులో దోపిడీకి పాల్పడ్డారని నిర్ధారించారు. ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాగా గుర్తించారు. దుండగుల వయస్సు 25 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితులు ముఖం కనిపించకుండా ఫేస్ మాస్క్లు ధరించినట్టు బాధితులు చెబుతున్నారు.
ఘటన జరిగింది ఇలా
కల్యాణ్ చౌదరి స్నేహపురి కాలనీ రోడ్నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్సేల్లో బంగారం సప్లై చేసే సుఖ్దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చారు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్ లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షటర్ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో కల్యాణ్ చౌదరి, సుఖ్దేవ్ గాయపడ్డారు.
3 కిలోల బంగారం.. రూ.5 లక్షలు..
సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చారు. ఆయనతో రాజ్కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా కాల్పులు జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ. 5 లక్షల నగదుతో పరారయ్యారని పోలీసులు గుర్తించారు.
ఆధారాల వేట
కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్ను పోలీసులు పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించాయి. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
నాగోల్ కాల్పుల్లో గాయపడ్డ బాధితులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరామర్శించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు బైక్స్ పై నలుగురు వచ్చి…. దోపిడీ చేసి పారిపోయారని సీపీ తెలిపారు. దొంగలు 4 రౌండ్లు కాల్పులు జరిపారని.. ఇది అంతరాష్ట్ర ముఠాల పనిగా భావిస్తున్నామన్నారు. బాధితులు కళ్యాణ్ చౌదరి, సుఖ్ దేవ్ కు వైద్యులు సర్జరీ చేశారు. 48 గంటలపాటు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు ప్రకటించారు. మొత్తం మీద ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్ గా మారింది.