National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు.యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మెుత్తం ఎక్కడిదనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50ఏ ప్రకారం అంజన్ కుమార్ యాదవ్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. అక్టోబర్ 3న అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ,రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. జూన్లో వరుసగా మూడు రోజులపాటు ఢిల్లీలో జరిగిన విచారణకు సోనియాగాంధీ హాజరయ్యారు.అప్పట్లో 70కి పైగా ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారు. ఈడీ ప్రశ్నలకు సోనియాగాంధీ సరైన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఈ కేసు విచారణను ఈడీ చేపట్టింది.