Revanthreddy : టీకాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో టీపీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ రెడ్డిని దింపడం ఎవరి వల్లా సాధ్యం కాదని స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ధరణి, భూ సమస్యలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలోకి ఇద్దరూ కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఈ విషయంపై మీడియా ప్రశ్నిస్తుండగానే.. రేవంత్ రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డికి, తనకు మధ్య జరిగేది తోడికోడళ్ల పంచాయితీ అని తెలిపారు. ఇద్దరం కాంగ్రెస్ నేతలమని, పొద్దున తిట్టుకుంటాం.. మళ్లీ కలిసిపోతామంటూ చెప్పుకొచ్చారు.
అనంతరం జగ్గారెడ్డి మాట్లాడారు. తాను టీపీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి దిగిన తర్వాతే అది సాధ్యమవుతుందన్నారు. తన కోరిక నెరవేరడానికి పదేళ్లైనా పడుతుందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రకు తన మద్దతుపై త్వరలో ప్రకటన చేస్తానన్నారు. అనంతరం ఏఐసీసీ నేత కొప్పుల రాజు, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహా తదితరులతో కలిసి ధరణి సమస్యలపై చర్చించారు.